తిరుమల కలియుగ వైకుంఠం

తిరుమల కలియుగ వైకుంఠం

bookmark

"తిరుమల కలియుగ వైకుంఠం:

కలియుగంలో దర్శన ప్రార్ధనార్చనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడు. తిరుమల ఆలయాన్ని, ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు.

దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వేంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాభ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాభ్దానికి చెందిన చోళులు (తంజావురు) పాండ్య రాజులు (మదురై), 13-14 శతాభ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతుడైన శ్రీ కృష్ణదేవ రాయలు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.

ఇక్కడ లభ్యమైన శాసనాలనుబట్టి 15 వందల ఏళ్ల నాటి నుండి తిరుమల చరిత్ర ఈ విధంగా ఉంది. పల్లవ రాణి సామవై క్రీ.శ.614. ఈ మహారాణి కాలం లో ఆనంద నిలయం జీర్ణోద్దరణ కావింపబడింది. శ్రీవారి అనేక ఆభరణాలు సమర్పిస్తూ, ఉత్సవాలు నిర్వహిస్తూ పరమభక్త శిరోమణి గా తిరుమల చ్రిత్ర లో శాశ్వతంగా నిలిచింది.ఈమెకి 'పేరుందేవి'అని మరో పేరువుంది. తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు క్రీ.శ.1328, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాధయాధవరాయలు క్రీ.శ.1429, హరిహరరాయలు క్రీ.శ. 1446 లలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.

సాళువ నరసింహరాయలు క్రీ.శ.1470 లో భార్య ఇద్దరు కుమారుల తన పేర్లతో సంపగి ప్రదక్షిణం నాలుగు మూలలో నాలుగు స్థంభాల మండపాలని నిర్మిచాడు.క్రీ.శ.1473 లో తిరుమలరాయ మండపానికి వేదిక నిర్మించాడు. ఉత్సవాలు జరిపించేవాడు.

శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ.1513 నుండి 1521 వరకు ఏడు సార్లు తిరుమలకి వచ్చి ఎన్నో కానుకలు సమర్పించాడు,ఉత్సవాలు నిర్వహించాడు. రాయలు 1513 ఫిబ్రవరి 10 న 25 వెండి పళ్లాలను ఇవ్వగా, స్వామివారి పాల ఆరగింపు కొరకు రాయల దేవేరులు రెండు బంగారు గిన్నెలు ఇచ్చారు. 1513 మే 2న రెండవసారి, 1513 జూన్ 13న మూడో సారి తిరుమల సందర్శించి,మూల విరాట్టుకు ఆభరణాలు, ఉత్సవ మూర్తులకు మూడు మణిమయ కిరీటాలు సమర్పించాడు. నిత్య నైవేద్యానికి ఐదు గ్రామాలను కానుకగా ఇచ్చాడు. 1514 జూన్ 6న నాల్గవసారి తిరుమలని దర్శించి,30 వేల వరహాలతో కనకాభిషేకం చేసాడు. నిత్యారాధన కోసం తాళ్ళపాక గ్రామాన్ని దానంగా ఇచ్చాడు.

1517 జనవరి 2న ఐదవ సారి తిరుమలకు వచ్చి ఆలయ ప్రాంగణంలో తమ విగ్రహాలను ప్రతిష్టించుకున్నాడు. 1518 సెప్టంబర్ 9న ఆనందనిలయానికి బంగారు పూత చేయించాడు. 1518 లో ఆరవసారి, 1521 ఫిబ్రవరి 17న ఏడవసారి తిరుమలకి వచ్చి నవరత్న కుళ్ళాయిని, పీతాంబరాలని సమర్పించాడు.

అచ్యుత రాయలు 1530 లో ఉత్సవాలు నిర్వహించాడు. ఆలయానికి ఎన్నో గ్రామాలు భూములను కానుకగా ఇచ్చాడు. 16 శతాబ్దం చివరలో తిరుమల రాయలు అన్నాఊయల మండపాన్ని విస్తరింపజేసి, ఉత్సవాలు నిర్వహించాడు. 1570లో వెంకటపతి రాయలు చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు.

విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఆలయం మహమ్మదీయుల పరమైనది. కర్నాటకకు నవాబైన దావూద్ ఖాన్ హైదరాబాదు నిజామ్ ప్రభువులకి కట్టవలసిన పన్నుల కొరకై ఆలయంపై పన్నులు విధించాడు. ఈ ఆదాయానికై మహమ్మదీయులు, మరాఠాలు గొడవలు పడ్డారు, 1740 లో మరాఠీ ప్రభువు ఆలయాన్ని స్వాధీన పరచుకుని,రక్షించి స్వామివారికి ఎన్నో అమ్మూల్య ఆభరణాలు సమర్పించాడు.

తరువాత క్రమంగా 1801 నాటికి ఆలయం ఈష్టిండియా కంపెనీ వారి వశమైంది. 1841లో ఆంగ్లప్రభుత్వం హిందూ మతసంస్థలలో జోక్యం చెసుకోకూడదని చట్టం చేసినందున ఆఅలయ నిర్వహణ మహంతులకు అప్పజెప్పింది. 1843 నుండి -

మహంతు సేవాదాస్ జీ,
మహంతు ధర్మ దాస్ జీ,
మహంతు భగవాన్ దాస్ జీ,
మహా వీరదాస్ జీ,
రామక్రిష్ణ దాస్ జీ,
ప్రయాగదాస్ జీ,
ఇలా 90 ఏళ్ల పాటు మహంతుల పాలనసాగింది.

వీరి తరువాత,1933 లోఅప్పటి గవర్నర్ ధర్మ కర్తల మండలిని ఏర్పాటు చేసాడు.

19 వ శతాబ్దాంతానికి కొండపైన శ్రీవారి ఆలయం, హథీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలూ ఉండేవి కావు. అర్చకులు సైతం కొండ కింద ఉన్న కొత్తూరులోనే ఉండేవాళ్లు. తెల్లవారుజామునే లేచి సప్తగిరులూ ఎక్కి ఉదయం ఏడు గంటలకు స్వామికి మేలుకొలుపులు పాడేవారు. అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ, గోవిందనామ స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు. రాళ్లూరప్పలూ నిండిన దారిలో కొంతసేపు వెళుతూ మధ్యలో వంటావార్పు కోసం ఆగుతూ... మొత్తానికి పైకి చేరుకునేసరికి దాదాపు రెండురోజులు పట్టేదట. వారు మధ్యలో ఆగేందుకు మూడుచోట్ల దిగుడుబావులూ విశ్రాంతి మండపాలూ ఉండేవి. వాటిని ఠాణాలు అనేవారు. వయసు మళ్లినవారినీ అంగవికలురనూ పిల్లలనూ పైకి తీసుకువెళ్లేందుకు డోలీ కూలీలు ఉండేవారు. కావడి బద్దకు కుర్చీలు అమర్చి నడవలేనివారిని వాటి మీద కూచోబెట్టుకుని వారు పైకి మోసుకెళ్లేవారు. అందుకు పది అణాలు రుసుము వసూలు చేసేవారు. సామాన్యులకు ఆ మాత్రం స్థోమత కూడా ఉండేది కాదు. తిరుమల రాగిచెట్టు (ఇప్పుడు కల్యాణకట్ట ఉన్న ప్రదేశం) దగ్గర డోలీలు నిలుపుకోవడానికి ఒక ప్రత్యేక మండపం ఉండేది. అక్కడిదాకానే ఈ డోలీలను అనుమతించేవారు. ఆ స్టాండును డోలీమండపం బ్లాక్ అనేవారు. (ఇప్పుడా రోడ్డునే డి.ఎం.బి. రోడ్డుగా వ్యవహరిస్తున్నారు.) అక్కణ్నుంచి సన్నిధి వీధి మీదుగా గుడికి చేరుకుని నేరుగా మహాద్వారం గుండా లోపలికి ప్రవేశించి భక్తులు స్వామి దర్శనం చేసుకొనేవారు. 1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండమీదకు మెట్లు నిర్మించింది. 1933లో ఏర్పడిన తితిదేబోర్డు రూ.26వేల ఖర్చుతో ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది. ఐదుపదుల ఏళ్లనాటి దేవస్థానం రికార్డుల ప్రకారం అప్పట్లో పొద్దున ఏడున్నరకు సుప్రభాత సేవ, రాత్రి పదిన్నరకు ఏకాంతసేవ జరిగేవి. ఇప్పుడు రాత్రి రెండున్నరకు ఆలయం మూసివేసి సరిగ్గా అరగంటలోనే మళ్లీ సుప్రభాతంతో మేల్కొలుపులు మొదలుపెడుతున్నారు.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవ మూర్తిని మలయప్ప స్వామి అంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భార్యలైన శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలను ఉభయ నాంచారులు అంటారు.

మలయప్ప స్వామి యొక్క నిజమైన పేరు మలై కునియా నిన్ర పెరుమాళ్

966A.D, కన్య మాసం లో ఈ బ్రహ్మోత్సవాలు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కి ఒక్కసరె జరిగేవి. అప్పుడు పల్లవుల రాణి ""సామవై"" శ్రీవేంకటేశ్వర స్వామికి వెండి విగ్రహం ప్రతిష్టించింది దీనిని ""భోగ శ్రీనివాసా"" అని పిలుచుకునేవారు. ఈ భోగశ్రీనివాసునినే ఉత్సవ మూర్తిగ బ్రహ్మోత్సవాలు సమయం తిరు వేధుల్లో 9 రోజులు తిప్పేవారు. కాని ఇప్పుడు వుండే మలయప్ప స్వామి ఉత్సవ మూర్తి మాత్రం 1339A.D నించి వెలుగులోకి వచ్చింది.

తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. ఈ మూర్తి స్వయంభూమూర్తి (అనగా స్వయంగా వెలసినది, ఎవరూ చెక్కి ప్రతిష్టించలేదు) అని భక్తుల విశ్వాసం. మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. వీరస్థానక పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు. నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.

ధ్రువబేరం షుమారుగా పది అడుగుల ఎత్తున్న స్వామివారి మూర్తి. 18 అంగుళాలున్న పద్మాకారం వేదికపై స్వామివారు నిలుచుని ఉంటారు. గురువారం సాయంకాలం, మరియు శుక్రవారం నాడు తప్ప ఇతర దినాలలో ఈ వేదిక, స్వామివారి పాదాలు తులసి దళాలతో కప్పబడి ఉంటాయి.

ధృవబేరం చక్కని ముఖకవళికలతో చెక్కబడిఉంది. ముక్కు మరీ ఎత్తూ కాదు, చప్పిడీ కాదు. కన్నులు స్పష్టంగా చెక్కబడినాయి. నుదుటిపై రేఖారూపంగా చెక్కబడిన నామం ఉంది. నిత్యం పచ్చకర్పూరంతో పెట్టిన నామం కన్నులను కొంతభాగం కప్పివేస్తుంది. నామం రూపం, సైజూ వంటి వివరాలు వైఖానస ఆగమంలో చెప్పినవిధంగా ఖచ్చితంగా పాటిస్తారు. స్వామివారి శిరస్సుపై (నుదుటిపైభాగం వరకు) కిరీటం చెక్కబడిఉన్నది. ఆయన జటాజూటము భుజాలపై పడుతూ ఉంటుంది. ఖచ్చితమైన కొలతలు తీసికొనబడనప్పటికీ స్వామివారి ఛాతీ వెడల్పు షుమారు 36-40 అంగుళాల మధ్య సైజులోనూ, నడుము భాగం వెడల్పు 24-27 అంగుళాలు సైజులోనూ ఉంటుంది. స్వామివారి నడుము పైభాగం ఆచ్ఛాదనారహితంగా ఉంటుంది. ఆయన వక్షస్థలం కుడిభాగాన శ్రీలక్ష్మీదేవి రూపం చెక్కబడిఉంది. స్వామివారు చతుర్భుజములను కలిగియున్నారు. పై కెత్తిన కుడిచేతిలోనున్న సుదర్శన చక్రము, ఎడమచేతిలోనున్న పాంచజన్య శంఖము విగ్రహంలో భాగాలు కావు. అదనంగా స్వామివేరి చేతులలో ఉంచిన అలంకారాయుధాలు. దిగువనున్న రెండుచేతులలోను కుడిచేయి వరదహస్తము (అరచేయి భక్తులకు కనిపిస్తూ, వరములను ప్రసాదిస్తున్నట్లుగా ఉంటుంది). ఎడమచేయి కట్యావలంబిత ముద్రలో (నడుమువద్ద మడచినచేయి. అరచేయి స్వామివారివైపు ఉంటుంది) ఉన్నది. నడుము క్రిందభాగంలో స్వామివారు ధోవతి ధరించి ఉంటారు. రెండు మోకాళ్ళూ కొంచెంగా వంగినట్లు కనిపిస్తాయి (స్వామివారు భక్తుల రక్షణకు నడచి రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా). స్వామివారు ఆయుధాలను ధరించిన త్రిభంగ రూపంలో ఉండనప్పటికీ స్వామివారి భుజాలపై ధనుర్బాణాల ముద్రలున్నాయి.

వేంకటేశ్వరునిగా వ్యవహరించే ఈ ధృవభేరం ఏ దేవతామూర్తిది, మొదటి నుంచి ఏ రూపంగా అక్కడ అర్చన కొనసాగింది అన్న విషయంపై తీవ్ర వాదోపవాదాలు సాగాయి. విష్ణుమూర్తి, శివుడు, కుమారస్వామి, శక్తి వంటి వివిధ దేవతారూపాల్లో ఎవరిది అన్న ప్రశ్నపై వేర్వేరు సంప్రదాయాలకు చెందిన భక్తులు వివిధ అభిప్రాయాలు ఏర్పరుచుకున్నారు. క్రీ.శ.11వ శతాబ్దిలో జరిగిన వాదోపవాదాల్లో వైష్ణవ మతాచార్యుడు రామానుజాచార్యుడు ప్రమాణయుతంగా వాదించి విష్ణువు విగ్రహమేనన్న వాదాన్ని గెలిపించి నేడు అనుసరిస్తున్న వైష్ణవ ఆగమాలను స్థిరపరిచినట్లు సాహిత్యాధారాలు చెబుతున్నాయి.

వివిధ ప్రతిపాదనలు
విగ్రహాన్ని ఏ ప్రాతిపదికలపై వివిధ సంప్రదాయాల వారు వేర్వేరు దేవీమూర్తులదిగా భావించారన్న విషయం ఇలా క్రోడీకరించవచ్చు:

శివుడు: తిరుమలలోని ధృవబేరాన్ని శివునిగా కొందరు భావించడానికి ముఖ్యకారణాలు విగ్రహానికి దీర్ఘకేశాలుండడం, ధనుర్మాసంలో నెలరోజుల పాటుగా బిల్వపత్రపూజ జరగడం వంటివి. విగ్రహం భుజాలపై నాగాభరణాలు ఉండడం కూడా ఈ సందేహానికి బలమిచ్చింది. ఈ పర్వతంపై శివుడు తపస్సు చేసినట్లు పురాణాలు చెప్తూండడమూ ఒక కారణం.
కుమారస్వామి: వామన పురాణంలో కుమారస్వామి రాక్షసవధ అనంతరం బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకునేందుకు తిరుమలలో తపస్సు చేసినట్టుగా ప్రస్తావన ఉంది. పవిత్రమైన కొలనులో స్నానమాచరించి పునీతం చేసినట్టుగా వుంది. తిరుమలలోని మూలవిరాట్టుగా ఆ కుమారస్వామే నిలిచారనే వాదన బలంగా వినిపించారు. తిరుమలలోని వేంకటేశ్వర ఆలయం పక్కనే ఉన్న స్వామి పుష్కరిణి అనే పుణ్య తీర్థంలోని స్వామి అన్న పదం ఏర్పడేందుకు స్వామి పదంతో ప్రసిద్దుడైన సుబ్రహ్మణ్యస్వామి పేరుతోనే ఏర్పడిందని భావించారు. విగ్రహానికి ఉన్న జటాజూటాలు, నాగాభరణాలు కుమారస్వామికి కూడా ఉంటాయని ప్రసిద్ధి.
పార్వతీదేవి: తిరుమల మూలవిరాట్టును శక్తిరూపంగా కూడా భావించారు. దీర్ఘమైన కేశాలు ఉండడం, శుక్రవారం పసుపుతో అర్చించడం ఈ ప్రతిపాదనలకు మూలకారణం. ధృవబేరానికి ఆరడుగుల పొడవైన చీరవంటి వస్త్రాన్ని కట్టడం కూడా శాక్తేయులు సమార్థనగా చూపించారు. ఆలయప్రాకారంపై సింహాలున్నాయి. సింహాలు శక్తిపీఠంపైనే ఉంటాయని వాదించారు.
ఇతర దైవాలు: విష్ణుమూర్తి నాభిలో కమలం ఉండి ఆ కమలం నుంచి బ్రహ్మ జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. కాగా తిరుమల ఆలయంలోని విగ్రహానికి నాభికమలం లేకపోగా కమలపీఠంపై విగ్రహం ఉండడంతో బ్రహ్మ కూడా కావచ్చని కొందరు, కాలభైరవుని విగ్రహమేమోనని మరికొందరు వాదించారు.
క్రీ.శ.పదకొండవ శతాబ్ది వరకూ విగ్రహానికి శంఖచక్రాలు ఉండేవి కాదు. శంఖమూ, చక్రమూ ధరించినట్టుగా చేతులు ఎత్తి వేళ్లను పైకి చూపిస్తూన్న భంగిమలో ఉండేది తప్ప శంఖచక్రం ఉండేదికాదు. విష్ణుమూర్తి విగ్రహమే అయ్యిఉంటే శంఖచక్రాలు ఉండేవి కదా అన్న వాదన జరిగింది. ధృవబేరానికి వందల సంవత్సరాలుగా వైఖానస ఆగమ పద్ధతులలోనే విష్ణుమూర్తి రూపమనే భావనతో ఆరాధనలు జరుగుతూన్నా శైవులు, శాక్తేయులలో వైష్ణవమూర్తి కాదనే నమ్మకం బలపడి క్రీ.శ.పదో శతాబ్ది నాటికి గందరగోళం నెలకొంది.

రామానుజాచార్యుల ఖండన
రామానుజాచార్యులు ధృవబేరం శివుడు, కార్తికేయుడు, శక్తి వంటి దేవతారూపాలు కాదని నిర్ధారణగా శ్రీమహావిష్ణువేనని నిరూపించారు. వేద పురాణ ప్రమాణాలను చూపి శైవుల వాదనలు ఖండించి అప్పటివరకూ కొనసాగుతున్న వైఖానస ఆగమంలో వైష్ణవ పూజా విధానాలు స్థిరపరిచారు.
అంతకుమునుపు శైవులు తమ వాదనలను క్రీ.శ.పదకొండవ శతాబ్ది నాటి స్థానిక యాదవరాజు వద్దకు తీసుకువెళ్ళారు. యాదవరాజుకు తమ ప్రతిపాదనలు, వాదనలు వివరించి శైవారాధనలు ప్రారంభించేందుకు అనుమతించమని కోరారు. అప్పటికే శైవులు, శాక్తేయులు విగ్రహాన్ని ఇతర దేవతావిగ్రహంగా ఆపాదించడమే కాక, ఎవరి సంప్రదాయాలను అనుసరించి వారు రకరకాల పూజలు ఆలయప్రాంగణంలో నిర్వహించుకోవడం, బలులు ఇవ్వడం వంటివి యాదవరాజుల కాలానికి తారాస్థాయికి చేరుకొన్నాయి. ఆ స్థితిగతుల మధ్య విశిష్టాద్వైత భాష్యకారుడు రామాజాచార్యులు తిరుమల ప్రాంతానికి చేరుకుని యాదవరాజు ముందు శ్రుతి(వేదం), పురాణాల నుంచి సాక్ష్యాధారాలను చూపించి వాదించారు. శివుడు, కార్తికేయుడు, శక్తి కాదని, విష్ణుమూర్తి విగ్రహమేనని నిర్ధారణ చేసేలా ప్రమాణయుతంగా నిరూపించారు.

విష్ణుమూర్తి విగ్రహంగా నిరూపణ
వేంకటేశ్వరస్వామి విగ్రహం విష్ణువా, కుమారస్వామియా, శివుడా, శక్తియా, కాలభైరవుడా, బ్రహ్మా అన్న విషయంపై జరిగిన నిర్ణయచర్చలో రామానుజులు ఇతర దైవాలన్న వాదనలు ఖండిస్తూ, విష్ణువేనన్న విషయాన్ని సమర్థిస్తూ చేసిన వాదనలోని అంశాలివి. అనంతాచార్యులు రచించిన వేంకటాచల ఇతిహాసమాలలో క్రీ.శ.పదకొండవ శతాబ్దినాడు జరిగిన ఈ వాదన విస్తారంగా వివరించారు.

వామనపురాణంలోని 33వ అధ్యాయంలో అగస్త్యుడు, ఇతర మునులు, వసువుతో స్వామి పుష్కరిణికి, వేంకటాచలానికి వెళ్తూ-అది నారాయణునికి ప్రీతిపాత్రమైన విష్ణుమూర్తి క్షేత్రమని ప్రస్తావిస్తారు. వరాహపురాణంలో సూతుని వాక్యాలు, భూ వరాహస్వాముల సంవాదం, పద్మపురాణంలోని శుకుని వాక్యాలు, గరుడపురాణంలో వశిష్ఠుడు అరుంధతికి చేసే బోధ, బ్రహ్మాండపురాణంలో భృగుమహర్షికి నారదుని బోధ వంటివి వైష్ణవ క్షేత్రంగా వేంకటాచలాన్ని అభివర్ణించారు. హరివంశ పురాణంలో భీష్ముడు తాను ఎలా వేంకటాచలానికి వచ్చాడో ధర్మరాజుకు చెప్తూ 'స్వామి పుష్కరిణీ తీరములో సూర్యమండలమువంటి విమానంలో శ్రీనివాసుడు వేంచేసి వున్నారని వర్ణించారు. వరాహపురాణంలో భూదేవి, వరాహమూర్తిల సంభాషణలో వేంకటాచలంపై పుష్కరిణీతీరంపై ఆనందము అనే పేరుగల పుణ్యవిమానంలో నివసిస్తాడని స్పష్టంగా చెప్తారు. పుష్కరిణికి పశ్చిమంగా, వరాహస్వామికి దక్షిణంగా శ్రీనివాసుడు నివసించడాన్ని గురించి పద్మపురాణం, మార్కండేయ, స్కంద, భవిష్యోత్తర పురాణాల్లో విపులవర్ణనలు ఉన్నాయి.
స్కందుడు ఈ ప్రాంతానికి వచ్చి తపమాచరించినందున ధృవబేరం ఆయన మూర్తేనన్న వాదన ఖండిస్తూ ఈ పర్వతానికి ఎవరు వచ్చినా శ్రీనివాసుని దర్శించుకుని, ఆయనను గురించి తపస్సు చేయడానికో, పాపప్రక్షాళనల కొరకో వచ్చినవారేనని పురాణాలే చెప్తున్నాయని వివరించారు. వామన పురాణంలో తారకాసురుని వధ వల్ల వచ్చిన పాపప్రక్షాళన ఎలా చేసుకోవాలని ప్రశ్నించిన స్కందునితో వేంకటాచల మహాత్మ్యం అక్కడ కొలువైన విష్ణుమూర్తి మహిమలు వివరించి పరమశివుడే వేంకటాచలం పంపినట్టు నారదుడు వాల్మీకితో చెప్పారు. వైష్ణవ మంత్రాల్లోకెల్లా ఉత్తమమైన వైష్ణవమంత్రం ఉపదేశించమని శంభుణ్ణి కోరి ఉపదేశం పొందిన స్కందుడు వేంకటాచలానికి వెళ్ళాడని పురాణం చెప్తోంది. పురాణాల పరంగా ఆదిశేషుడు, వాయుదేవుడూ ఈ పర్వతంపై తపమాచరించారని అంతమాత్రాన ఇది వాయుక్షేత్రమో, శేషుని క్షేత్రమో అవుతుందా అని ప్రశ్నించారు. స్వామి పుష్కరిణికి ఆ పేరు రావడం వెనుక అది తీర్థాలన్నిటికీ సార్వభౌమమని భగవంతుడు వరం ఇవ్వడమే కారణమని స్పష్టం చేశారు. తపస్సు ఆచరించడానికి వచ్చిన కుమారస్వామి కనుక ఆయుధాలు లేవని శైవుల సమర్థనను వామన పురాణంలో వేంకటాచలం వెళ్ళినపుడు కుమారస్వామి ధనుస్సు, శక్తి ధరించే వెళ్ళినట్టు ఉండడాన్ని గుర్తుచేసి ఖండించారు. ధృవబేరానికి రెండు చేతులు కటిహస్తం, వరదహస్తం కాగా మరో రెండు చేతులూ పైకి ఎత్తి ఆయుధాలు పట్టుకోవడానికి ఎత్తినట్టు ఉంటాయి. శరవణుడే ఐతే ధనుస్సు ఆయుధంగా కల ఆయన అది వదిలారనుకున్నా అలా చెయ్యి ఎత్తిపట్టుకోరు కదా.
శంఖ చక్రాలు ధరించకపోవడాన్ని సమర్థిస్తూ పురాణాల్లో చోళరాజుకు ఐదు ఆయుధాలు ఇవ్వడం, రాక్షస సంహారం కోసం తొండమాను చక్రవర్తికి తన శంఖచక్రాలు ఇచ్చినట్టున్న సందర్భాలు వివరించారు. శ్రీనివాసుడు తొండమానుడికి ఆయుధాలు ఇచ్చినప్పుడు వరం కోరుకొమ్మంటే తనకు సహాయంగా శ్రీహరి శంఖచక్రాలు ఇచ్చినట్టు తరతరాలుగా తెలిసేట్టు ఆ ఆయుధాలు ధరించని స్థితిలో ఉండమని కోరాడు. దాన్ని మన్నించి ఆ ఆయుధాలను అవ్యక్తంగా ఉంచేశారనే ఘటన వివరించి సమర్థించారు. తొండమానుడితో సంభాషణలోనే భవిష్యత్ కాలంలో తాను తిరిగి శంఖచక్రాలు ధరిస్తానని తెలిపారట. వీటన్నిటి నేపథ్యంలో వాదనల అనంతరం స్వామి ముందు విష్ణు ఆయుధాలైన శంఖచక్రాలు, సుబ్రహ్మణ్య ఆయుధాలైన శక్తి, శివపార్వతుల త్రిశూలం బంగారంతో చేయించి ముందుంచారు. నీవు ఏ దైవానివైతే ఆ ఆయుధాలు స్వీకరించమని ప్రార్థించి తెల్లవార్లూ ఆలయం చుట్టూ కాపలా ఉండి ఉదయం తెరచి చూశారు. ఖాళీ చేతుల స్థానంలో శంఖ చక్రాలు చేరాయని అదే స్థితిలో నేటికీ ధృవబేరం ఉందని వేంకటాచల ఇతిహాసమాల తెలిపింది.
వక్షఃస్థలంపై లక్ష్మీశ్రీవత్సం ఉండడం కూడా వేంకటేశుడే శ్రీనివాసుడని సూచిస్తున్నట్టుగా తెలిపారు."