చండీశ్వరుడు
"చండీశ్వరుడు:
ఒక శివభక్తుడు తన తండ్రి దగ్గరే వేదం చదువుకుంటూ ఉండేవాడు. ఒకనాడు గోవుని గోపాలకుడు కొట్టడంచూసి ""ఎందుకు కొడుతున్నావు?"" అని అడిగితే ఐతే నువ్వే వీటిని సాకు అని చెప్తే అలాగే చేస్తాను అని అతడే ఆగోవులను సాకసాగాడు. ఆ పిల్లవాని ఆధీనంలో ఉన్న గోపాలకుల గోవులు అత్యధిక పాలు ఇవ్వడంవల్ల గ్రామంలో అందరికీ పాలు సమృద్ధిగా దొరికేవి. కారణం ఆ పిల్లవాడు గో క్షీరంతో సైకత లింగానికి రుద్రం చెప్తూ అభిషేకం చేసేవాడు. అది చూసిన ఇతరులు ఆ పిల్లవాడు పాలు పాడు చేస్తున్నాడనీ, అవి కూడా ఉంటే ఇంకా సమృద్ధి కలుగుతుందనీ ఆ పిల్లవాని తండ్రికి చెప్పారు. అది నిర్ధారించుకుందామని ఆ పిల్లవాని తండ్రి ఒక చోట దాగి తన కొడుకేంచేస్తున్నాడో వేచి చూస్తున్నాడు. ఇది తెలియని పిల్లవాడు తన మానాన తాను ఒక సైకత లింగాన్ని నిర్మించి రుద్రం చెప్తూ గోవులని పిలచి గో క్షీరం తీసుకొని అభిషేకం చేయడం, ఒక గోవు తరవాత ఒక గోవు ఇలా కడవలకి కడవలు అభిషేకం జరగడం అతని తండ్రి చూసి ఆగ్రహోదగ్రుడై ఆవు పాలు నేల పాలు చేస్తున్నావా అని ఆ పిల్లవాడిని వెనకనుంచి కొడితే అంతర్ముఖత్వంతో అభిషేకం చేస్తున్న అతను కదలలేదు..... కాదు కాదుఆయనకి కొట్టిన దెబ్బ తెలియలేదు. కొట్టినా లేవకుండా ఆ పాలు మట్టిలో పోస్తున్నావా అని గదమాయించి కాలితో సైకత శివలింగాన్ని భగ్నం చేసాడు. వేద విదుడైనా ఆయన దృష్టిలో అది నేలమీద పోస్తున్న పాలు మాత్రమే, మనసు లగ్నం చేసి శివునికే అభిషేకం చేస్తున్నాని తలుస్తూ మనసులో శివునికే అభిషేకం చేస్తూ ఉన్న ఆ పిల్లవాడు శివలింగం భగ్నమవడంతో కళ్ళు తెరచి కోపాన్ని పొంది, ఎదురుగా కోపంతో ఊగుతున్న తన తండ్రిని చూసి, శివలింగం భగ్నానికి కారణమైన కాలుండరాదని పక్కన గోవులు కాయడంకోసం రక్షణగా తెచ్చుకున్న గొడ్డలి కనపడితే దాన్ని తన తండ్రి కాలిమీదకు విసిరాడు. అంత ఆ కాలు నరకబడి అందులోంచి రక్తం ఏరులా ప్రవహించి ఆ పిల్లవాని తండ్రి మరణించాడు. దానికి చలించిపోయిన శివుడు, ఏమిరా తండ్రీ నాకోసం కన్న తండ్రినే శిక్షించినవాడివని మెచ్చుకొని, నీకు తండ్రిలేడనే బాధలేదు నేనే నీకు తండ్రిని అని తన కుటుంబంలో ఒకడిగా వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామితో సమానంగా తన కొడుకుగా తన కుటుంబంలో స్థానమిచ్చాడు. అప్పట్నుంచి నలుగురుగా ఉన్న శివ కుటుంబం ఐదుగురైంది. ఆ పిల్లవాణ్ణి తన కుటుబ సభ్యునిగా స్థానమిచ్చి తన నిర్మాల్యానికి అధికారిగా నియమించాడు. ఇంకోవిధంగా చెప్పాలంటే దానికి అధికారిణి ఐన అమ్మవారు భార్యగా తనకున్న అదృష్టాన్నీ, అధికారాన్నీ తన మూడవ కొడుకైన ఆ పిల్లవానికి ఇచ్చింది. ఆయనే చండీశ్వరుడు. ఎప్పుడూ శివుని పక్కన ఉత్తర దిక్కు గా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. ప్రకటంగా ఆ మూర్తి శివాలయాలలో ఉన్నా లేకున్నా శివలింగం ఉంది అంటే ఆయన అక్కడే ఉంటారు. శివ నిర్మాల్యం ప్రసాదంలాగా కానీ , అభిషేక తీర్థం కానీ తీసుకోవాలంటే చండీశ్వరులవారి అనుమతిలేనిదే కుదరదు. ఆయన అనుమతి అపేక్షించకుండా తీసుకుంటే శివాజ్ఞకి వ్యతిరిక్తంగా ప్రవర్తించినట్టు అవుతుంది. ఇది శివపురాణం, శైవాగమం ప్రకారం కూడా ఆలయంలో చండీశ్వర స్థానం ఉంటుంది. మన ఇంట్లో రుద్రాభిషేకం చేసుకున్నా, లేదా నిత్యార్చన చేస్తున్నా నిర్మాల్యాన్ని ఉత్తర చండీశ్వరునికి చూపిస్తున్నట్లు ఉత్తరానికి చూపించి నిర్మాల్యాన్ని కళ్ళకద్దుకుని తీయడం పద్ధతిగా వస్తున్నది."
